హైదరాబాద్ : త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 31 నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్లో సానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పనులు సాగుతున్న తీరును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్లో సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఎంపీలు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉంటారని, సమావేశాలు మెరుగ్గా సాగుతాయని బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిపై సమీక్ష నిర్వహించి, సురక్షితంగా సభలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఉభయ సభల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm