న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్ రిపబ్లిక్ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. అయితే భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఇదే తొలిసారి. భారత్-ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు కూడా జరుపుకున్నాయి. ప్రతి ఏడాది భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఎవరూ ముఖ్య అతిథులుగా హాజరుకాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm