నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా తెలంగాణ సర్కార్ ప్రగతి పథంలో పయనిస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఎనిమిదిన్నరేళ్ల వయసున్న రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని ప్రశంసించారు. ''పుట్టుక నీది/ చావు నీది/ బతుకంతా దేశానిది`` అన్న ప్రజాకవి కాళోజి కవితతో ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం.. చివరగా “కరువంటూ.. కాటకమంటూ కనిపించని కాలాలెపుడో.. పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో..” అంటూ మహాకవి దాశరథి కృష్ణమాచార్య కవితను స్ఫురిస్తూ.. కరవు, ఆకలి లేని ప్రపంచం కోసం, భవిష్యత్ తరాల స్వప్నాలు సాకారమయ్యే ప్రపంచం కోసం మనమంతా కృషి చేద్దామంటూ దాశరథి కవితతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగాన్ని ముగించారు.